NMC | న్యూఢిల్లీ: జాతీయ స్థాయి వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న సంక్లిష్టతను సరళతరం చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎయిమ్స్ వంటి జాతీయ స్థాయి మెడికల్ కాలేజీలతోపాటు రాష్ర్టాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. కేవలం రెండు దరఖాస్తుల ద్వారా మెడికల్ సీట్లకు పోటీపడేలా కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఇందులో ప్రభుత్వ కాలేజీల కోసం ఒకటి.. ప్రైవేటు కాలేజీల్లో సీటు కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఎన్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. 2024-25 వైద్య విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానంపై త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయని తెలిపాయి. రెండు దరఖాస్తులు చేయడం ద్వారా.. విద్యార్థి ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చని, ఒక వేళ విద్యార్థి కోరుకొన్న చోట సీటు రాకుంటే తదుపరి కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపాయి.
మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు, వివిధ రాష్ర్టాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విద్యార్థులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ర్టాల్లోని కాలేజీల్లో 15 శాతం సీట్లను జాతీయ స్థాయి ఓపెన్ కోటాకు రిజర్వ్ చేస్తారు. ఏ రాష్ట్రం విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉన్న ఈ సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగేది. ఆ తర్వాతనే రాష్ర్టాల్లోని మిగతా కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించే వారు. ఈ ఏడాది నుంచి పాత విధానానికి ముగింపు పలికి, జాతీయ, రాష్ట్ర స్థాయి సీట్లంన్నింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 681 మెడికల్ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్బీ వంటి పీజీ కోర్సులకు 67,802 సీట్లు అందుబాటులో ఉన్నాయి.