పాట్నా, జనవరి 28: బీహార్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్కు, ప్రతిపక్ష ఇండియా కూటమికి గుడ్బై చెప్పారు.
అనంతరం బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని రాజ్భవన్లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీశ్తో సీఎంగా ప్రమాణం చేయించారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, డిప్యూటీ సీఎంలుగా.. మరో బీజేపీ నేత ప్రేమ్ చంద్, జేడీయూ సభ్యులు విజయ్ కుమార్, విజేంద్ర యాదవ్, శ్రావణ్ కుమార్తోపాటు జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం పార్టీకి చెందిన సంతోష్ కుమార్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. అర్జేడీ ఈ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయగా.. కాంగ్రెస్ గైర్హాజరయింది. ప్రమాణస్వీకారం అనంతరం నితీశ్ మాట్లాడుతూ.. ఇక ఎన్డీయేని వీడేది లేదన్నారు. అంతకుముందు మహాఘట్బంధన్ కూటమిలో తనకు పరిస్థితులు బాగా లేవని, తాను సంతృప్తిగా లేనని పేర్కొంటూ నితీశ్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అనంతరం గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు
డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. ఓబీసీ నేత సామ్రాట్ చౌదరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా గత ఏడాది బాధ్యతలు తీసుకొన్నారు. గతంలో రబ్రీ దేవి ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2014లో 13 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుతో ఆర్జేడీలో చీలికకు ప్రయత్నించారు. ఇక పార్టీ శాసనపక్ష ఉప నేతగా ఎన్నికైన 55 ఏండ్ల విజయ్ సిన్హా.. 2020, నవంబర్-2022, ఆగస్టు మధ్య అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. ఆయనకు వ్యతిరేకంగా మహాఘట్బంధన్ కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టడంతో స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. విజయ్ సిన్హా గతంలో మంత్రిగానూ చేశారు.
సొంతంగా ఎన్నడూ మెజార్టీ సాధించకున్నా..
నితీశ్ కుమార్ ఓ విధంగా అదృష్టం ఉన్న నేతగా చెప్పొచ్చు. జేడీయూ ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సొంతంగా మెజార్టీ సాధించనప్పటికీ, కింగ్ మేకర్గా నిలిచి సీఎం పీఠాన్ని దక్కించుకొంటూ వస్తున్నారు. కూటములను జంప్ చేసే విషయంలో నితీశ్ పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్లో రాయొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ ఎద్దేవా చేశారు.
త్వరలో జేడీయూ కథ ఖతం: తేజస్వీ
నితీశ్ బీజేపీతో జట్టు కట్టడంపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జేడీయూ పార్టీ కథ త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో ఖతం అవుతుందని అన్నారు. ప్రజలు తమ వైపు ఉన్నారని, వారి కోసం నిలబడుతామని పేర్కొన్నారు. ‘ఒక్కటి అయితే స్పష్టంగా చెబుతున్నాను. ఆట ఇప్పుడే మొదలైంది. జరుగాల్సింది ఇంకా చాలా ఉన్నది’ అని తేజస్వీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. మహాకూటమి ప్రభుత్వాన్ని చంపేసి, బీజేపీ పంచన చేరిన నితీశ్కు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాగా, చెత్త ఎప్పటికైనా డస్ట్బిన్లోకే వెళ్తుందంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఎక్స్లో పోస్టు చేశారు.
ఊసరవెల్లితో పోటీపడుతున్నారు: కాంగ్రెస్
రంగుల మార్చడంలో నితీశ్ ఊసరవెల్లితో పోటీపడుతున్నారని, మోసం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు, నిపుణుడు అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తిని, అతడిని ఆడిస్తున్న వారిని(పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి) బీహార్ ప్రజలు క్షమించబోరని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఇలాంటి రాజకీయ డ్రామాలు చేస్తున్నదని విమర్శించారు. కాగా, సీఎంగా నితీశ్ రాజీనామా చేస్తారనే విషయం తమకు ముందే తెలుసునని, లాలూ, తేజస్వీ ఈ విషయం చెప్పారని, అయితే విపక్ష ఇండియా కూటమి ఐఖ్యతను దృష్టిలో పెట్టుకొని తాము బయటకు ఏమీ చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
ఏడాది కూడా నిలబడదు:ప్రశాంత్ కిషోర్
జేడీయూ-బీజేపీ కొత్త పొత్తు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే ఆ రెండు పార్టీలు మళ్లీ విడిపోతాయని జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ.. నితీశ్ కుమార్తో తిరిగి జట్టు కట్టిందని, అయితే కమలం పార్టీ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
2022లో కటీఫ్ తర్వాత నితీశ్కు తలుపులు మూసుకుపోయాయని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బెగుసరాయ్లో ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ నితీశ్ జంపింగ్ తనకు ఆశ్చర్యం కలిగించలేదని, ఆయన మహాఘట్బంధన్ కూటమితో ఎక్కువ రోజులు ఉండబోరని తాను చెప్తూనే ఉన్నానన్నారు. అర్జేడీ చీఫ్ లాలూ హయాంలో కాంగ్రెస్ చేసినట్టుగానే.. ఇప్పుడు బీజేపీ కూడా చేస్తున్నదని విమర్శించారు.
కూటములు మార్చడంలో దిట్ట!
1951లో జన్మించిన నితీశ్ కుమార్.. బీహార్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యనభ్యసించారు. చదువుకొనే సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే ఆయన తర్వాత జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. 1985లో హర్నౌత్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000లో బీజేపీ మద్దతుతో తొలిసారి సీఎం అయిన నితీశ్.. సరిపడా మెజార్టీ లేకపోవడంతో ఏడు రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. తర్వాత 2005లో బీజేపీతో కలిసి అధికారం చేపట్టారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకొన్నారు.
బయటి నుంచి ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. 2014లో లోక్సభ ఎన్నికల్లో జేడీయూ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఒక్క సంవత్సరంలోనే 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్తో కూటమికట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నితీశ్ కుమార్ తర్వాత రెండేండ్లకే 2017లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పంచన చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోసారి సీఎం అయిన ఆయన రెండేండ్ల తర్వాత బీజేపీ తన పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ 2022లో ఆర్జేడీ కూటమి వైపు వెళ్లి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరోసారి జంప్ చేసి బీజేపీతో మరోసారి జతకట్టారు.