కుల జనగణనపై అఖిల పక్షానికి నితీశ్ సిద్ధం
ఇప్పటికే అన్ని పార్టీలతో మాట్లాడినట్టు వెల్లడి
మిత్రపక్షం బీజేపీ వ్యతిరేకిస్తున్నా ముందుకే..
కమలదళంపై గతకొంతకాలంగా నితీశ్ గుర్రు
పాట్నా, మే 23: అనూహ్య రాజకీయ పరిణామాలకు బీహార్ వేదికగా మారుతున్నది. మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య స్నేహబంధం చెడినట్టు తెలుస్తున్నది. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీహార్లో కుల జనగణనపై ఈ నెల 27న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం నితీశ్కుమార్ సోమవారం ప్రకటించారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొన్న తర్వాత ప్రతిపాదనను రాష్ట్ర క్యాబినెట్ ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించినట్టు తెలిపారు. బీహార్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కుల జనగణనకు మద్దతిస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
బీహార్లో బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ కుల జనగణనను వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొన్నది. కొన్ని రోజులుగా జేడీయూ, బీజేపీ మధ్య అభిప్రాయ భేదాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కుల జనగణనపై బీహార్లోని బీజేపీలో కూడా భిన్న స్వరం వినిపిస్తున్నది. తాము కుల జనగణనను ఎప్పుడూ వ్యతిరేకించలేదని బీహార్ బీజేపీలోని బీసీ నేతలు చెప్తున్నారు. కేంద్రంలో మాత్రం ఆ పార్టీ వ్యతిరేకిస్తున్నది. కుల జనగణన కోసం బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ కూడా సానుకూలంగా ఉంది. తేజస్వి, నితీశ్ ఇద్దరూ కిందటేడాది ప్రధాని మోదీని కలిసి కుల జనగణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పలు సందర్భాల్లో ఇద్దరూ ఒకే వేదికను పంచుకొన్నారు. ఇది బీజేపీకి చికాకు కలిగిస్తున్నది. తాజాగా సీఎం, ప్రతిపక్ష నేత తేజస్వి ఇద్దరూ ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీ వ్యతిరేక చర్యకు పూనుకోవడం రాజకీయంగా కీలకంగా మారింది.
ఎప్పటినుంచో.. కుతకుత
బీహార్లో మిత్రపక్షం జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. నితీశ్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. కానీ, తెర వెనుక అంతా బీజేపీయే నడిపిస్తుండటం నితీశ్కు మింగుడుపడటం లేదని రాజకీయ పండితులు చెప్తున్నారు. తాను ఏ నిర్ణయం తీసుకొందామనుకొన్నా బీజేపీ నేతలు అడ్డు రావడంపై నితీశ్ బాధపడుతున్నారని అంటున్నారు. కేంద్రంలోనూ మోదీ ప్రభుత్వ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, అందుకే బీజేపీ నుంచి దూరం జరిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్ నడుస్తున్నది. సోమవారం కులగణనపై నితీశ్ ప్రకటన చేయటం దానిలో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. వాస్తవానికి కులగణనకు బీజేపీ వ్యతిరేకం. కానీ, కులగణనపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని నితీశ్ ప్రకటించారు. బీజేపీకి గుడ్బై చెప్పి, ఆర్జేడీకి దగ్గరయ్యేందుకు నితీశ్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.