న్యూఢిల్లీ : పలు ప్రభుత్వ ప్రాజెక్టులు నత్తనడకన సాగడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల అమలులో జాప్యంతో తరచుగా ప్రాజెక్టు వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదని, అయితే వ్యవస్ధాగత లోటుపాట్లతోనే ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ యంత్రాంగంలో నిర్ణయారాహిత్యం, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమే పెద్ద సమస్యగా ముందుకొస్తోందని ఎస్సీఎల్ ఇండియా 2021 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ పేర్కొన్నారు. 2025 వరకూ జాతీయ మౌలిక వసతుల కార్యక్రమం కింద భారీ కేటాయింపులతో దేశ ఆర్ధిక వ్యవస్ధలో కేంద్రం ఉత్తేజం నింపుతోందని అన్నారు.
దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి సమకూరుస్తున్న నిర్మాణ రంగం జీడీపీకి ఊతమిస్తోందని చెప్పారు. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, లోటుపాట్లను పరిష్కరించేందుకు తన నేతృత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన కమిటీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.