న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ వెల్లడించిన మల్టీడైమెన్షల్ పేదరిక సూచీ (ఎంపీఏ) నివేదికలో బిహార్, జార్ఖండ్, యూపీ అతి పేద రాష్ట్రాలుగా నిలిచాయి. ఈ సూచీ ప్రకారం బిమార్లో 51.91 శాతం జనాభా పేదరికంలో మగ్గుతుండగా, జార్ఖండ్లో 42.16 శాతం, యూపీలో 37.79 శాతం మంది ప్రజలు పేదరికంతో అల్లాడుతున్నారు. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ (36.55 శాతం), మేఘాలయ (32.67) శాతం వరుసగా నాలుగు, అయిదు స్ధానాల్లో నిలిచాయి.
ఇక భారత్లో తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలుగా కేరళ (0.71), గోవా (3.76), సిక్కిం (3.82), తమిళనాడు (4.89), పంజాబ్ (5.59) శాతంతో పేదరిక సూచీలో అట్టడుగున నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంంతాల్లో దాద్రానగర్ హవేలి (27.36 శాతం), జమ్ము కశ్మీర్, లడఖ్ (12.58), డామన్ అండ్ డయ్యూ (6.82 శాతం), చండీఘఢ్ (5.97 శాతం)తో అత్యంత పేద కేంద్రపాలిత ప్రాంతాలుగా ఈ సూచీలో నిలిచాయి. పుదుచ్చేరి జనాభాలో కేవలం 1.72 శాతం పేదరికంలో మగ్గుతుండగా, లక్షద్వీప్ (1.82 శాతం), అండమాన్ నికోబార్ దీవులు (4.3), ఢిల్లీ(4.79) శాతంతో మెరుగైన పనితీరు కనబరిచాయి.
ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ (ఓపీహెచ్ఐ), యూఎన్డీపీ అభివృద్ధి చేసిన అంతర్జాతీయ ఆమోదిత విధానంలో దేశ ఎంపీఐని గణించామని నివేదిక వెల్లడించింది. విద్య, వైద్య వసతులు, జీవనప్రమాణాల వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది. పోషకాహారం, విద్య, పాఠశాలల్లో విద్యార్ధుల హాజరు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, హౌసింగ్, ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలు వంటి 12 ఇండికేటర్ల ఆధారంగా ఎంపీఐ సూచీని రూపొందించామని నివేదిక తెలిపింది.