NITI Aayog | న్యూఢిల్లీ: నిర్ణీత పరిమితి లేకుండా గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం సరికాదని, ఇది ‘పంట మార్పిడి’పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ పరిధిలోని వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ఆహార భద్రత చట్టం, ఇతర సంక్షేమ పథకాల అవసరాలకు సరిపడా మాత్రమే వీటిని కొనుగోలు చేయాలని సిఫారసు చేసింది.
ప్రధాన ఆహార ఉత్పత్తుల డిమాండ్, సప్లయ్ని విశ్లేషించి ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన 23 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాలోని రైతన్నలు చలో ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తున్న వేళ తాజా నివేదిక బయటకు రావడం గమనార్హం. ఒకవేళ మార్కెట్లో మిగులు ధాన్యం ఉన్నా, లేదా వరి, గోధుమ నుంచి రైతులు ఇతర పంటలకు మళ్లాల్సి వచ్చినా వారికి పరిహారం అందించవచ్చని కమిటీ పేర్కొన్నది.