(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభంపై నీతిఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి ఆకలి లేని భారత్ను నెలకొల్పే లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింతగా పెంచాల్సిన అవసరమున్నదన్న ఆయన.. ఏటికేడాది ఆహారోత్పత్తిలో కనీసం 2 శాతం మేర వృద్ధిని నమోదుచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కాగా, ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 28.7 హంగర్ స్కోరుతో 111వ స్థానంలో నిలిచి కిందటేడాది ర్యాంకుతో పోలిస్తే ఈ సంవత్సరం నాలుగు స్థానాలను కోల్పోవడం తెలిసిందే.
దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటివరకూ బియ్యం, గోధుమ, కందిపప్పు, టమాట మోతమోగగా, ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తున్నది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ. 80 నుంచి రూ. 100 వరకూ పలుకుతున్నది. కొరతను తగ్గించడానికి అఫ్గానిస్థాన్ నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నది.