Loksabha Elections 2024 : బీజేపీ క్రోనీ క్యాపిటలిజంలో మునిగితేలుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ తీవ్ర వామపక్ష వాదాన్ని అందిపుచ్చుకున్నారని అన్నారు. ఇది రెచ్చగొట్టేలా కనిపిస్తుంది..వెంటనే ఆవేశం పెంచుతుంది..రాజకీయ ప్రచారానికి ఆకట్టుకునేలా ఉంటుందని కానీ క్రోనీ క్యాపిటలిజం గురించి ఎవరు మాట్లాడుతున్నారనేది ముఖ్యమని నిర్మలా సీతారామన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ పదాన్ని వాడటం విడ్డూరమని ఆమె పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో క్రోనీ క్యాపిటలిజం ఉందని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలకు ఇది హాల్మార్క్ అని అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడటంలో రాహుల్ గాంధీ నిపుణులని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై ముచ్చటించారు. గత పదేండ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలను చూసిన అనంతరం దేశ ప్రజలు మరోసారి ఆయనకు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
Read More :