న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: మన దేశంలో వరుసగా ఐదు సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరో మంత్రిగా రికార్డు సృష్టించారు. సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ ఆమెకు వరుసగా ఐదవది. అంతకుముందు అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్లు ఇలా వరుసగా ఐదుసార్లు బడ్జెట్ను సమర్పించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ 2014-15 నుంచి 2018-19 వరకు కేంద్ర బడ్జెట్ను సమర్పించారు. తర్వాత 2019లో రెండోసారి మోదీ అధికారం చేపట్టాక నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టి వరుసగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఆ సంవత్సరం బడ్జెట్ సమర్పణలో స్వతంత్ర భారతంలో ఇందిరా గాంధీ (1970-71) తర్వాత రెండో మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు. అప్పటి వరకు బ్రీఫ్కేస్ ద్వారా బడ్జెట్ పత్రాలను తెచ్చే సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన ఆమె జాతీయ చిహ్నంతో ఉన్న ‘బహీ-ఖటా’లో పత్రాలను తీసుకువచ్చారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డు స్థాయిలో 10 సార్లు బడ్జెట్ను సమర్పించారు.
నిర్మల అతి చిన్న బడ్జెట్ ప్రసంగం ఇదే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 87 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఆమె ఇప్పటివరకు వరుసగా చేసిన 5 బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి చిన్నది. గతేడాది ఆమె 92 నిమిషాలు ప్రసంగించగా, 2021లో 110 నిమిషాల సేపు మాట్లాడారు. దేశ చరిత్రలో సుదీర్ఘ సమ యం (2022లో 2 గంటల 40 నిమిషాలు) బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలదే.
ప్రత్యేక ఆకర్షణగా మంత్రి నిర్మల చీర
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆమె ధరించిన చేనేత చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె ప్రతిసారి చేనేత చీరతోనే దర్శనమిస్తున్నారు. ఈసారి ఆమె ధరించిన చీరకో ప్రత్యేకత ఉన్నది. ఆ చీర నల్లని అంచుపై చేతితో కసూటి ఎంబ్రాయిడరీని అల్లారు. ఆ ఎంబ్రాయిడరీ కర్ణాటకలోని ధార్వాడ్కు మాత్రమే ప్రత్యేకం. జీఐ గుర్తింపు కూడా పొందినది. ఆ చీరను నిర్మలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్ ఎంపీ) ఆమెకు బహుమతిగా ఇచ్చారు.