న్యూఢిల్లీ : ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టంచేశారు. ఆ ప్రచారం ఉత్త ఊహాగానమేనని కొట్టిపారేశారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో ఆమె మాట్లాడారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎలక్టోరల్ బాండ్లకు (Electoral Bonds) సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. వాటిని ఈసీ తన వెబ్సైట్లో పొందుపర్చింది. అయితే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు ఉపక్రమించాయని, ఆ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలపై నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం ఉందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాగానమని కొట్టి పారేశారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని, మరి దాన్నేమనాలని ఆమె ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలన్నీ బీజేపీకే వెళ్లినట్లు ప్రచారం చేస్తున్నారని, బీజేపీతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా విరాళాలు వెళ్లాయి కదా..! అని ఆమె అడిగారు.
ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించించడం గురించి ప్రస్తావించగా.. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. కోర్టు అడిగిన వివరాల సంగతి ఎస్బీఐ చూసుకుంటుందని చెప్పారు. ఎన్నికల బాండ్ల స్కీమ్ గురించి మాట్లాడుతూ.. గత వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి కదా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. తనకంటే ముందు ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్జైట్లీ మునుపటి కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను తీసుకొచ్చారని చెప్పారు.
ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయని, సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.