వ్యక్తిగత ఆదాయ పన్ను ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే ఎక్కువ.
– నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: హోంలోన్, మెడికల్ బిల్లులు, మ్యూచ్వల్ ఫండ్స్, ఎల్ఐసీ పాలసీలు, స్కూల్ ఫీజులు వంటి వాటితో పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఆశలు ఇక నెరవేరవు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పన్ను మినహాయింపు విధానానికి మంగళం పాడేందుకు కేంద్రం తాజా బడ్జెట్లో పావులు కదిపింది. గత ఏడాది తీసుకొచ్చిన కొత్త పన్ను విధానానికి వేతన జీవులను మళ్లించేందుకు ప్రయత్నించింది. వచ్చే బడ్జెట్ నాటికి పాత విధానాన్ని రద్దు చేసినా ఆశ్చర్యంలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపై ఏడాదిలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి ప్రభుత్వం విధించిన పన్ను కట్టాల్సిందే.
ఐటీ రిటర్ను దాఖలు సమయంలో పాత, కొత్త పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకొనే అవకాశం ఉంటుంది. తాజా బడ్జెట్లో పాత పద్ధతిలో పన్ను రేట్లుగానీ, శ్లాబులుగానీ, పన్ను మినహాయింపులు గానీ, స్టాండర్డ్ డిడక్షన్గానీ, పన్ను రిబేటు పరిమితినిగానీ మార్చలేదు. పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారన్న మధ్యతరగతి వర్గం ఆశలు నెరవేరలేదు. రానున్న రోజుల్లో పాత పద్ధతిని ఎత్తివేసి, అత్యధిక మందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర అభిమతంగా కన్పిస్తున్నదని నిపుణలు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఒక ఉద్యోగి, వ్యాపారి వార్షిక వేతనం/ఆదాయం ఏడాది మొత్తంలో సంపాదించే మొత్తంలో కొంత ఆదాయ పన్నుగా చెల్లించాలి. పాత పన్ను విధానంలో పన్నులు తగ్గించుకొనేందుకు కొన్ని మార్గాలున్నాయి. సెక్షన్ 80సీ విభాగం కింద బీమా, యూలిప్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 80డీ, ఎన్పీఎస్, ఈపీఎఫ్, గృహ రుణంపై అసలు, వడ్డీ, మెడికల్ బిల్లులతో కూడా పన్ను రాయితీ పొందొచ్చు. పన్ను ఆదాయం తగ్గుతోందని ఈ పద్ధతికి తిలోదకాలు ఇచ్చేందుకు కేంద్రం గత ఏడాది కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అందులో రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు పన్ను చెల్లించనవసరం లేదు. పన్ను చెల్లింపుదారు ఎలాంటి మినహాయింపులనూ పొందేందుకు అవకాశం లేదు. ఈ కొత్త విధానాన్ని చాలా తక్కువమంది ఎంచుకొన్నారు. దీంతో కొత్త బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం రూ.7 లక్షలకు పెంచింది. పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు చేయడంతోపాటు అధికాదాయ వర్గాలకు స్టాండర్డ్ డిడక్షన్లో కొద్దిగా ప్రయోజనాన్ని కల్పించింది.
కొంతమంది వివిధ సెక్షన్ల కింద ఉన్న పన్ను మినహాయింపులను వినియోగించుకోరు. అలాంటి వాళ్లకు కొత్త పన్ను విధానం మేలు. రూ.7 లక్షలలోపు ఆదాయం ఉన్నవాళ్లు కొత్త విధానాన్ని ఎంచుకొంటే ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ రూ.10 లక్షలకుపైగా ఆదాయం ఉండి, ఎక్కువ మిహాయింపులు కోరేవాళ్లకు పాత విధానమే మేలని నిపుణులు చెప్తున్నారు.
బడ్జెట్ ప్రసంగం విన్న వాళ్లకు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం చూస్తున్న వాళ్లలో చాలా మంది ఈ అయోమయంలో ఉన్నారు. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షలు పరిమితిని రూ.3 లక్షలకు మాత్రమే పెంచారు కదా.. మరి రూ.7 లక్షల వరకు మినహాయింపు ఎలా వర్తిస్తుందని కొందరు అడుగుతున్నారు. మొత్తం ఆదాయంతో సంబంధం లేకుండా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం (వివిధ మినహాయింపులు తీసేయగా వచ్చే మొత్తం) గరిష్ఠంగా రూ.7 లక్షలు ఉన్నాసరే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు అనేది బడ్జెట్ సారాంశం. అంటే మీ వార్షిక వేతనం నెలకు రూ.50 వేలకుపైగా ఉన్నాసరే.. కొత్త విధానం కింద మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే పాత విధానంలో అయితే, రూ.3 లక్షల ఆదాయం దాటితే పన్ను పరిధిలోకి వస్తారు.
న్యూఢిల్లీ: దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. 2014-15లో రూ.27 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న దిగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.45.69 లక్షల కోట్లకు చేరాయి. ఎగుమతులు రూ.19 లక్షల కోట్ల నుంచి రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం రూ.16 లక్షల కోట్లు. క్రూడాయిల్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, ఇంజినీరింగ్ గూడ్స్ అత్యధికంగా దిగుమతి అవుతుండటంతో వాణిజ్యలోటు దూసుకుపోతున్నది.
కేంద్ర బడ్జెట్ చూస్తే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో, ప్రత్యేకించి ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో అభివృద్ధి పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు స్పష్టమైంది. కర్ణాటక, మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరుగనున్నందున నిధులు కేటాయించినట్టు కనిపిస్తున్నది. తమిళనాడుకు, రాష్ట్ర ప్రజలకు అసంతృప్తి మిగిల్చింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను బడ్జెట్లో పట్టించుకోలేదు. రాష్ర్టాల ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఎలాంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు బడ్జెట్లో లేవు. పాత పన్ను విధానంలో ఉన్న వారికి కూడా ఆదాయ పన్ను పరిమితి తగ్గింపు వర్తింపచేయాలి.
– తమిళనాడు సీఎం స్టాలిన్
ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లిలా వ్యవహరిస్తున్నది. ఢిల్లీ ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ల రూపంలో రూ.1.75 లక్షల కోట్లు చెల్లించారు. కానీ, ఢిల్లీ అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.325 కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్తో ద్రవ్యోల్బణం నుంచి ఎలాంటి ఉపశమనం కలగకపోగా మరింత పెరుగుతుంది. దేశంలో నిరుద్యోగాన్ని తొలగించేందుకు కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు. విద్యకు కేటాయింపులను 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం, వైద్యానికి 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం ప్రమాదకరం.
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
బడ్జెట్ పూర్తిగా ప్రజా, పేదల వ్యతిరేక బడ్జెట్. ఇది భవిష్యత్తుకు సంబంధించినది కాదు. కేవలం అవకాశవాదానికి సంబంధించినది మాత్రమే. కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజలకే ఇది మేలు చేస్తుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ఇది చీకటి బడ్జెట్. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ల మార్పు ఎవరికీ ఉపయోగపడదు. నాకు అరగంట సమయమిస్తే పేదలకు చేసే బడ్జెట్ ఎలా తయారుచేయాలో చూపిస్తాను.
– బెంగాల్ సీఎం మమత
బడ్జెట్ దేశ ప్రజల్లో నిరాశనే మిగిల్చింది. ఈ బడ్జెట్ వల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరింత పెరుగుతుంది. బడ్జెట్లు పెట్టడంలో బీజేపీ ప్రభుత్వం దశాబ్దం పూర్తి చేసుకుంటున్నది. గతంలో ప్రజలకు ఏమీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఏమిస్తుందిలే. రైతులు, కార్మికులు, యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపార తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ నిరాశ కల్పించింది. కేవలం ధనికులకే మేలు చేసేలా ఉంది.
– ఎస్పీ అధినేత అఖిలేశ్
బడ్జెట్ నుంచి పంజాబ్ను తప్పించారు. మేము బీఎస్ఎఫ్ అప్గ్రేడేషన్, ఆధునికీకరణ, యాంటీ డ్రోన్ సిస్టమ్ కోసం రూ.1000 కోట్లు అడిగినా బడ్జెట్లో ఇవ్వలేదు. ఈ బడ్జెట్ వల్ల పంజాబ్ ప్రజలకు జరిగే మేలేమీ లేదు.
– పంజాబ్ సీఎం భగవంత్ మాన్
దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చాలా కాలంగా కేరళ కోసం మేము అడుగుతున్న ఎయిమ్స్, రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు.
– కేరళ సీఎం విజయన్
కేంద్ర బడ్జెట్ కర్ణాటక ప్రజల్ని తప్పుదారి పట్టించేదిగా ఉంది. కేంద్రం ఇప్పుడు బడ్జెట్లో హామీల్ని గుప్పించినప్పటికీ వచ్చే ఏప్రిల్ నుంచే ఆయా పథకాల అమలుకు నిధులు కావాలి. వచ్చే ప్రభుత్వంపైనే వాటి అమలు ఆధారపడి ఉంటుంది. కొన్ని నెలల్లో జరుగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి పథకాల్ని ప్రకటించినట్టు ఉంది. బడ్జెట్లో ప్రకటించిన అన్ని పథకాలు అమలు అవుతాయా అనేది ప్రశ్నార్థకం. భద్ర, మహదాయి, కృష్ణ పథకాలకు ఈ బడ్జెట్లో కాకుండా ఇంతకు ముందే నిధుల్ని ప్రకటించి ఉంటే బాగుండేది.
– కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
బడ్జెట్లో ఉద్యోగాల కల్పనపై దృష్టి లేదు. అధిక ధరలను పరిష్కరించే ప్రణాళిక లేదు. అసమానతలను నిరోధించే ఉద్దేశం లేదు. 1% ధనికులు 40% సంపదను కలిగి ఉన్నారు. 50% మంది పేదలది జీఎస్టీలో 64% వాటా. 42% యువత నిరుద్యోగులుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రధాని పట్టించుకోవడం లేదు. భవిష్యత్తును నిర్మించడానికి ప్రభుత్వానికి రోడ్మ్యాప్ లేదు.
– కాంగ్రెస్ నేత రాహుల్
2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇండ్లు ఇస్తామని.. 2022 నాటికి 80 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని 2014 ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పుడు 2023లో కూడా వారికి అబద్ధాలాడే అలవాటు పోలేదు. బీజేపీకి వంద శాతం ఎంపీలను ఇచ్చిన బీహార్ను బడ్జెట్లో మరోసారి బీజేపీ మోసం చేసింది.
-బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి
ప్రజల కొనుగోలు శక్తి పెంచి దేశీయ డిమాండ్ను బలోపేతం చేసేలా బడ్జెట్ లేదు. ధనికులకు రాయితీలు ఇవ్వడం కంటే మౌలిక వసతులను మెరుగుపర్చడానికి, ఉద్యోగాల కల్పనకు కృషి చేసుంటే బాగుండేది. కర్ణాటకకు భారీగా నిధులివ్వడం చూస్తుంటే.. బీజేపీ పాలిత రాష్ర్టాలకే మేలు జరుగుతున్నదని తెలుస్తున్నది.
– సీపీఎం నేత ఏచూరి
బడ్జెట్ ప్రజల కోసం రూపొందించి ఉంటే బాగుండేది. తొమ్మిదేండ్లుగా బడ్జెట్లో కేంద్రం అనేక వాగ్దానాలతో ప్రజలపై ఆశల జల్లు కురిపిస్తున్నది. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో మధ్య తరగతి దిగువ మధ్యతరగతిగా మారుతుంటే ఇవన్నీ వృథా అవుతునట్టే.
– బీఎస్పీ అధినేత్రి మయావతి