Nirmala Sitharaman : దేశ ఆర్థికవ్యవస్థ, కుటుంబాల సంక్షేమం విషయంలో తాము చూపిస్తున్న శ్రద్ధను కాంగ్రెస్ అగ్రనేత (Congress Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుర్తించలేకపోతున్నారని కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) అన్నారు. ఆయన లోక్సభ (Lok Sabha) లో మాట్లాడిన ప్రతిసారీ కేవలం విమర్శలకే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకునే క్రమంలో దేశం సాధించిన విజయాలను తక్కువ చేసి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో వికసిత్ భారత్ సంకల్ప సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొని ప్రసంగించారు.
‘భారీ విపత్తు ముంచుకొస్తోందని, రాబోయే కొద్ది వారాల్లో అంతా కుప్పకూలిపోతుందని రాహుల్ గాంధీ తరచూ అంటుంటారు. ఆయన చెబుతున్నట్లుగా దేశంలో ఎలాంటి సంక్షోభం లేదు. ఆర్థికవ్యవస్థ ఏటికేడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. జీడీపీ గణాంకాలూ దీనిని సూచిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నది. అయినప్పటికీ భారత్ సంక్షోభంలో ఉందని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు యత్నిస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ దేశం ప్రగతి పథంలో సాగుతోంది. ఇంధన సరఫరాలు నిరంతరాయంగా కొనసాగేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారు’ అని చెప్పారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల పాలన.. అభివృద్ధి, సంక్షేమంతో సాగిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మొత్తం 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని అన్నారు. ప్రస్తుతం దేశంలో 58 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 144 కోట్ల ఆధార్లు, 125 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. డిజిటల్ లావాదేవీలకు ‘యూపీఐ’ ఓ నమూనాగా మారిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.