హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో హైకోర్టు జడ్జిలు శుక్రవారం ఆమెకు వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరుగనున్నది. తెలంగాణ హైకోర్టు మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్గా హిమా కోహ్లీ ఈ ఏడాది జనవరి 7న నియమితులైనారు. సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయనున్న సందర్భంలోనే ఆమెకు సుప్రీం జడ్జిగా పదోన్నతి లభించడం విశేషం. దీంతో మరో మూడేళ్ల పాటు హిమా కోహ్లీ జడ్జిగా పనిచేసే అవకాశం లభించింది. రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగేదాకా సీనియర్ జడ్జి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా పనిచేసే అవకాశం ఉంది. జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లనుండటంతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 11కు తగ్గనున్నది. కాగా, హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ఏడుగురు జిల్లా జడ్జిల పేర్లను హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. సిఫారసులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు మొత్తం జడ్జిల సంఖ్యను ఇటీవలే 24 నుంచి 42కు పెంచారు.