శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా (Pulwama), షోపియాన్ (Shopian) జిల్లాల్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇండ్లలో సోదాలు చేస్తున్నది. పాకిస్థాన్ ప్రోత్సాహంతో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రసంస్థలకు (Terror groups) నిధులు సమకూరుస్తున్నారని ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 11న బారాముల్లా జిల్లాలోని కాన్సిపురాకు చెందిన అబ్దుల్ ఖలీక్ రెగో ఇంటిపై, జావిద్ అహ్మద్ ధోబి, షోయబ్ అహ్మద్ చూర్ నివాసాల్లో కూడా అధికారులు తనిఖీ చేశారు.
ఏప్రిల్ 20న పూంచ్ ( Poonch attack) జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. భింబర్ గలీ నుంచి సాంగ్యోట్ కు ఆర్మీ వాహనం వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నవారిని గుర్తించేపనిలో ఎన్ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మే 9న శ్రీనగర్, కుప్వారా, పూంచ్, రాజౌరితో సహా పలు ప్రాంతాల్లో దాడులు జరిపారు. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేర నకిలీ పేర్లతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల కుట్రను ఛేదించేందుకు అధికారులు సోదాలు నిర్వహించారు. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి.