శ్రీనగర్: జమ్ముకశ్మీర్ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేత యాసిన్ మాలిక్కు మరణ శిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డిమాండ్ చేసింది. 2017లో జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంతోపాటు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించిన కేసుల్లో యాసిన్ మాలిక్ను దోషిగా ఢిల్లీ కోర్టు గత వారం నిర్ధారించింది. శిక్షలపై బుధవారం తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్కు మరణ శిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్కు వినతించింది. యాసిన్ మాలిక్ తరుఫున వాదించేందుకు కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, ఆయనకు జీవిత ఖైదు విధించాలని సూచించింది. అయితే తనపై ఎన్ఐఏ చేసిన ఆరోపణలను యాసిన్ మాలిక్ తోసిపుచ్చారు.
కాగా, యాసిన్ మాలిక్కు విధించే శిక్షపై తీర్పును కోర్టు మరి కొన్నిగంటల్లో వెల్లడించనున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లోని సున్నిత ప్రాంతాలను మూసివేశారు. శ్రీనగర్ లాల్ చౌక్లోని కొన్ని దుకాణాలతో సహా మైసుమా, పరిసర ప్రాంతాల్లోని చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా షాపులు బంద్ అయ్యాయి. మరోవైపు శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు భారీగా భద్రతా దళాలను మోహరించారు.