ముస్లింలే లక్ష్యంగా దాడులు, బుల్డోజర్లతో ఇండ్ల కూల్చివేతలు
‘న్యూయార్క్టైమ్స్’లో కథనం
న్యూయార్క్, మే 11: నిరంతర మత ఘర్షణలతో భారత్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ప్రఖ్యాత వార్తాసంస్థ న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని వెలువరించింది. హిందూత్వ గ్రూపులు, నాయకుల విద్వేషపూరిత వ్యాఖ్యలతో అల్లర్లు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామనవమి, హనుమాన్ జయంతి సమయాల్లో జరిగిన అల్లర్లను ప్రస్తావించింది. ఘర్షణలపై కోర్టుల్లో విచారణ జరుగుతున్నప్పటికీ, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని మంత్రులు అవేమీ పట్టించుకోవట్లేదని ఆరోపించింది.
మధ్యప్రదేశ్లోని ఖరగోన్లో జరిగిన అల్లర్లకు ముస్లింలను బాధ్యులుగా చేస్తూ, వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయాలన్న ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యలను ఉదహరించింది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, బీజేపీ కింద పనిచేస్తున్న ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఇటీవల ముస్లింల ఇండ్లను కూల్చివేయడాన్ని కూడాప్రస్తావించింది. కూల్చివేతలను నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఢిల్లీ అధికారులు రెండు గంటల పాటు కూల్చివేతల ప్రక్రియను కొనసాగించడాన్ని ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని మండిపడింది.