న్యూఢిల్లీ, జూలై 29: వైద్య విద్య కోర్సుల్లో రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు, పీజీ, దంత వైద్యవిద్య కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్లకు (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) 10 శాతం రిజర్వేషన్ అమలుకు ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గురువారం వెల్లడించింది. జాతీయస్థాయి కోటా (ఆలిండియా కోటా స్కీమ్-ఏఐక్యూ) విభాగంలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వివరించింది. తాజా నిర్ణయంతో ఎంబీబీఎస్లో ఏటా 1,500 మంది, పీజీలో 2,500 మంది ఓబీసీ విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్లో 550 ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీలో వెయ్యి మందికి అవకాశం లభిస్తుందని వెల్లడించింది. తాజా నిర్ణయంతో ఇతర రాష్ర్టాల్లోని వైద్య కళాశాలల్లో సీట్లకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు పోటీపడొచ్చు. ఆలిండియా కోటా స్కీమ్ ద్వారా వారికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి.
చారిత్రాత్మక నిర్ణయం
వైద్య విద్యలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఏటా వేలమంది యువతీ యువకులకు అవకాశాలు లభించడంతో పాటు దేశంలో సామాజిక న్యాయం కొత్తరూపు సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యవిద్యలో ఇది చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
దశాబ్దానికిపైగా పెండింగ్
ప్రతిభ గల విద్యార్థులు ఇతర రాష్ర్టాల్లో ఉన్న అత్యుత్తమ వైద్య కళాశాలల్లో మెడిసన్ కోర్సులు చదివేందుకు వీలుగా 1986లో జాతీయ స్థాయిలో రిజర్వేషన్ కోటాపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు రిజర్వ్డ్ క్యాటగిరీల వారికి కేటాయించాలి. అయితే 2007వరకూ ఆలిండియా కోటా కింద ఎటువంటి రిజర్వేషన్లు అమలు కాలేదు. దీంతో ఈ కోటా కింద వైద్యవిద్యలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ 2007లో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. మరోవైపు, 2007లోనే సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్) చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, స్టేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న అంశం అలాగే పెండింగ్లో ఉన్నది. ఇంకోవైపు, వైద్యవిద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ విభాగానికి చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని 2019లో రాజ్యాంగ సవరణ చేశారు. దీని అమలులో కూడా జాప్యం జరిగింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న వైద్యవిద్యలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్కు మార్గం సుగమమైంది.