New Parliament | కేంద్రం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే, పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధానమంత్రి కాదన్నారు. ‘కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభించబడాలి. ప్రధానమంత్రి కాదు’ అంటూ రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. అదే రోజున వీడీ సావర్కర్ జయంతి రోజు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. కేంద్రం చర్య జాతి నిర్మాతలను అవమానించడమేనని కాంగ్రెస్ అభిప్రాయపడింది.
ఇంతకు ముందు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సైతం ప్రధాని మోదీ ప్రారంభించడంపై అభ్యంతరం తెలిపారు. ప్రధాని పార్లమెంట్ను ప్రారంభించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని కార్యనిర్వహక వర్గానికి అధిపతి అని, రాజ్యాంగం ప్రకారం అధికారాల విభజన స్పష్టంగా ఉందన్నారు. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని, వారితో పార్లమెంట్ను ప్రారంభించవచ్చన్నారు. పార్లమెంట్ భవనాన్ని ప్రజాధనంతో నిర్మించారని, ప్రధాని తన మిత్రుల డబ్బుతో నిర్మించినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు.