న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్యం లభించి 75 ఏండ్లు పూర్తయ్యే సందర్భంలో నూతన పార్లమెంట్ భవనం సిద్ధం కానుంది. 2022 ఆగస్ఠ్ నాటికి నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ముగిసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఓం బిర్లా విలేకరులతో మాట్లాడారు. పెగాసస్, వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాలపై విపక్షాల నిరసనల నడుమ సభలో తీవ్ర గందరగోళం చెలరేగిన సంగతి తెలిసిందే. లోక్సభలో పరిణామాలు తనను బాధించాయని స్పీకర్ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ఆశించిన విధంగా సభా కార్యక్రమాలు సాగలేదని అన్నారు. సమావేశాల్లో సభ కేవలం 21 గంటలే సజావుగా నడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సమావేశాల్లో ఓబీసీ బిల్లు సహా 20 బిల్లులు సభ ఆమోదం పొందాయి.