(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) ;రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకొన్నందుకు సంబరపడుతున్న బీజేపీకి మిత్రపక్షాలు షాక్ ఇస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. మరో రాష్ట్రం తన ఖాతాలోకి వచ్చిందని ఒకవైపు సంబురపడుతుండగానే.. మరోవైపు బీహార్ చేజారిపోతుండడం కమలం పార్టీ పెద్దల్ని ఆందోళనకు గురిచేస్తున్నది.
రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఆశించి భంగపడిన బీహార్ సీఎం నితీశ్కుమార్ తనదారి తాను చూసుకుంటున్నారు. ఎన్డీఏకు నేడోరేపో ఆయన గుడ్బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు జోరందుకొన్నాయి. కొద్దిరోజులుగా బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ప్రకటించినప్పడు జేడీయూ నేతలు కినుకవహించారంటూ వార్తలు వచ్చాయి. తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటించడంలోనూ తొలుత తమ పార్టీని సంప్రదించకపోవడంపైనా జేడీయూ నేతలు అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవిని తమకు కేటాయిస్తారని జేడీయూ ఆశించిందని, కానీ బీజేపీ మొండిచెయ్యి చూపించడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఖాతరు చేయకపోవడంపై నితీశ్ ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీ తనను ఏమాత్రం ఖాతరు చేయకపోవడం పట్ల ఆగ్రహంతో ఉన్న నితీశ్ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. పదిరోజుల్లో ఆయన పక్కన పడేసిన మూడో ఆహ్వానం ఇది. గత 17న జాతీయ జెండాపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి నితీశ్ డుమ్మా కొట్టారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వీడ్కోలు సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు కూడా ఆయన హాజరు కాలేదు. నిజానికి కొంతకాలంగా బీజేపీ, నితీశ్ నేతృత్వంలోని జేడీయూ అనేక అంశాలపై ఎడమొగం పెడమొగంగా ఉంటున్నాయి.
అగ్నిపథ్ పథకం రద్దు చేయాల్సిందేనని నితీశ్ స్పష్టం చేశారు. మరోవైపు అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల విషయంలో నితీశ్ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని అమిత్షా విమర్శలు ఎక్కుపెట్టారు. అంతకుముందు బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రసంగం సందర్భంగా వేసిన ఆహ్వానంలో సీఎం నితీశ్ పేరుగానీ, ఫొటో గానీ లేకపోవడం మిత్రపక్షాల మధ్య అగ్గి రాజేసింది. బీజేపీ తనను వాడుకొని వదిలేయాలని బీజేపీ చూస్తున్నట్టు నితీశ్ భావిస్తున్నారు. జరిగింది చాలు ఇక ఎవరి దారి వారు చూసుకోవడం మంచిదేనని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలిసింది.