Tamilnadu | ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. మాల్స్, పార్లర్లు, పార్కులు, మెట్రో రైళ్లు, జువెలరీ షాపులు, థియేటర్లు 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడిపించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, 9 నుంచి ఇంటర్ వరకు మాత్రం ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని సూచించింది.
ఇక పెళ్లిళ్లు కేవలం 100 మందితో మాత్రమే జరుపుకోవాలని, అంత్యక్రియలకు కేవల 50 మంది మాత్రమే హాజరు కావాలని నిబంధనలను విధించింది. మరోవైపు శుక్రవారం ఒక్కరోజే తమిళనాడులో 75 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 120 కి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేసింది.