న్యూఢిల్లీ, జనవరి 9: భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల డిప్యూటీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాల్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో లక్షద్వీప్లో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఎయిర్పోర్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మినికోయ్లో విమానాశ్రయాన్ని నెలకొల్పనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, మాయిజ్జు సర్కార్ తీరుపై ఆ దేశ ప్రతిపక్షాలు, మాలీవులు పర్యాటక అసోసియేషన్లు మండిపడుతున్నాయి. అత్యంత మిత్ర దేశం భారత్తో వ్యవహరించే తీరు ఇది కాదని చివాట్లు పెడుతున్నాయి.
డిప్యూటీ మంత్రుల వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ, ట్రావెల్ ఏజెంట్స్, టూర్ ఆపరేటర్స్ భారత్కు క్షమాపణలు చెప్పాయి. ఆపద సమయంలో మాల్దీవులను ఆదుకునే ‘911 కాల్’ భారత్.. అంటూ ప్రధాన ప్రతిపక్షం ఎంఎన్పీ నాయకురాలు మరియా అహ్మద్ దీదీ అన్నారు. విదేశాంగ విధానంలో స్థిరత్వం లోపించిందని, అధ్యక్షుడు మాయిజ్జుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఎంపీ అజీం అలీ అన్నారు. అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన ప్రతిపక్ష పార్టీలను కోరారు.
భారత్ అతిపెద్ద మార్కెట్
చిన్న చిన్న దీవుల సముదాయం మాల్దీవులు. దేశ జీడీపీలో మూడోవంతు పర్యాటకం నుంచే వస్తున్నది. 44వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపుతున్నది. గతకొన్నేండ్లుగా మాల్దీవుల పర్యాటకానికి భారత్ అతిపెద్ద మార్కెట్గా మారింది. కరోనా సంక్షోభ సమయంలోనూ 66వేల మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు. 2023లో 2,09,198 మంది, 2022లో 2,40,000 మంది, 2021లో 2,11,000 మంది భారతీయులు మాల్దీవుల్లో పర్యటించారు.
భారత్ పర్యటనకు మాయిజ్జు?
భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు మాల్దీవులు చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు మాయిజ్జు త్వరలో భారత్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు! ప్రస్తుతం మాల్దీవుల అధికారులు అధ్యక్షుడి ఢిల్లీ పర్యటనను ఖరారు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఆయన భారతదేశంలో పర్యటిస్తారని వార్తా కథనాలు వెలువడ్డాయి. మాయిజ్జు ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఫుజియాన్ ప్రావిన్స్లో మాల్దీవుల బిజినెస్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ, చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్పై ప్రశంసలు కురిపించారు. అలాగే చైనా నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేట్టు చర్యలు చేపట్టాలని జీ జిన్పింగ్ ప్రభుత్వాన్ని మాయిజ్జు కోరారు. టూరిజం జోన్ అభివృద్ధి నిమిత్తం చైనాతో 50 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.