పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ ప్రయాణించేందుకు వీలుగా వాహనాలను నిలిపేయడంతో ఓ అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది. పాట్నాకు సమీపంలోని ఫటుహ వద్ద నలంద ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం నితీశ్ తిరిగి పాట్నా వెళ్తున్నపుడు ఫట్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్నారిని చికిత్స కోసం పాట్నాలోని దవాఖానకు తరలిస్తున్న అంబులెన్స్ను కూడా పోలీసులు నిలిపేశారు. దీంతో ఆ బాలుని తల్లి తీవ్రంగా విలపించడం కనిపించింది. దాదాపు గంట సేపు అంబులెన్స్ కదలకపోవడంతో ఆ బాలుడు స్పృహ లేని స్థితికి వెళ్లాడు. అంబులెన్స్ డ్రైవర్ ధనంజయ్ కుమార్ మాట్లాడుతూ, సీఎం వస్తున్నందువల్ల వాహనాలను నిలిపేశారని, అత్యవసర చికిత్స కోసం బాలుడిని పాట్నాలోని దవాఖానకు తీసుకెళ్త్తున్నామని చెప్పారు.