బెంగళూరు, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విపక్ష పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.. ఎహే! మేం మాత్రం అలాంటివి చేయబోమని నీతులు చెప్పారు.. తీరా తనదాకా వచ్చేసరికి వారసులకే టికెట్లన్నీ పంచిపెట్టింది బీజేపీ. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారంటూ ప్రధాని మోదీ తెలంగాణలో మాటలూది 4 రోజులు కూడా కాకముందే కర్ణాటకలో ఆయన గారి పార్టీ బీజేపీ.. వారసులకే పెద్ద మొత్తంలో టికెట్లు కట్టబెట్టింది. తొలిజాబితాలో మొత్తం 189 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా, అందులో 20 మంది వారసులే ఉండటం గమనార్హం. మరోవైపు.. కర్ణాటక బీజేపీలో అసెంబ్లీ టికెట్ల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం రాత్రి 189 మంది అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన తొలి జాబితా.. ఆ పార్టీలో అసంతృప్తి జ్వాల రేపింది.
పలువురు నేతల తిరుగుబాటుతో కర్ణాటక బీజేపీలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత లక్ష్మణ్ సావడితో పాటు పలువురు నేతలతో పాటు వందల మంది పార్టీ కార్యకర్తలు రాజీనామాలు చేస్తుండగా.. మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నారు. టికెట్ల నిరాకరణకు గురైన నేతల మద్దతుదారులు ఆందోళనకు దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తమకు టికెట్లు నిరాకరించి, పార్టీలో ఇటీవల చేరిన లేదా ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి పార్టీ టికెట్ ఇవ్వడం ఏమిటని పలువురు తమ పార్టీ అధినాయకత్వాన్ని నిలదీస్తున్నారు. జయనగర్ నుంచి టికెట్ అశించి భంగపడ్డ ఎన్ఆర్ రమేశ్కు మద్దతుగా 1,200 మంది బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
వరుసపెట్టి పార్టీకి గుడ్బై
బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్న, రాజీనామాలు చేస్తున్న బీజేపీ నేతల జాబితా భారీగానే ఉన్నది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ కూడా పార్టీ నుంచి నిష్క్రమణను ప్రకటించారు. మంత్రిగా ఉన్న ఎస్ అంగారా బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోతానని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆర్ శంకర్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. రాణి బెన్నూరు నుంచి ఇండిపెండెంట్గా పోటీచేస్తానని తెలిపారు. బెళగావి జిల్లా బైలెంగల టికెట్ ఆశించిన విశ్వనాథ్ పాటిల్ కూడా రాజీనామా యోచనలో ఉన్నారు. చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ నుంచి గూళిహట్టి శేఖర్ బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తున్నది. టికెట్టు నిరాకరణకు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు మహదేవప్ప (రామదుర్గ్), అనిల్ బెనకే (బెళగావి నార్త్) మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.
బీజేపీ నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు శివమొగ్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఇప్పటికే తన రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. ఈశ్వరప్పకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా దాదాపు 20 మంది శివమొగ్గ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను టికెట్ కోసం చిప్ప పట్టుకొని అధిష్టానం చుట్టూ తిరిగి అడుక్కొనే వ్యక్తిని కాదని, ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నాయకుడిని అని లక్ష్మణ్ సావడి పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లారని సమాచారం. లక్ష్మణ్ సావడి బెళగావి జిల్లా అథణి నుంచి టికెట్టు ఆశించారు. లింగాయత్ సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న లక్ష్మణ్కు బెళగావి పొరుగు జిల్లాల్లో కూడా కొంత పట్టు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రౌడీషీటర్కు టికెట్
తొలి జాబితాలో బీజేపీ ఓ రౌడీషీటర్కు టికెట్టిచ్చింది. రౌడీషీటర్ లిస్టులోని మణికంఠ రాథోడ్ను చితాపూర్ నుంచి బరిలోకి నిలిపింది. బియ్యం అక్రమ రవాణాతో పాటు యాదగిరి, విజయపుర, కల్బుర్గి జిల్లాల్లోని పలు పోలీసుస్టేషన్లలో ఆయనపై క్రిమినల్ కేసులున్నాయి. గతంలో కల్బుర్గి నగర పోలీసు కమిషనర్ మణికంఠను ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారు. మరోవైపు వివాదాస్పద వ్యక్తి యశ్పాల్ సువర్ణకు బీజేపీ ఉడుపి స్థానం టికెట్ ఇచ్చింది. హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆరుగురు బాలికలు ఉగ్రవాదులంటూ యశ్పాల్ వ్యాఖ్యానించారు.
1. సీఎం బవసరాజ్ బొమ్మై, మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు
2. బీవై విజయేంద్ర, మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు
3. రవి సుబ్రమణ్య, ఎంపీ తేజస్వీ సూర్య మామ
4. జ్యోతి గణేశ్, ఎంపీ బవసరాజ్ కుమారుడు
5. సోదరులు రమేశ్ జార్కిహోళి, బాలచంద్ర జార్కిహోళి
6. మాజీ మంత్రి ఉమేశ్ కత్తి కుమారుడు, సోదరుడు
7. ఇద్దరు రెడ్డి సోదరులకు ఎమ్మెల్యే టికెట్లు
8. హర్షవర్ధన్, ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ మామ
9. శశికళ, ఎంపీ అన్నాసాహెబ్ భార్య
10. ప్రీతమ్ నాగప్ప, మాజీ మంత్రి కుమారుడు
11. అవినాశ్ జాదవ్, ఎంపీ ఉమేశ్ జాదవ్ కుమారుడు
12. కుమార్ బంగారప్ప, మాజీ సీఎం కుమారుడు
13. దత్తాత్రేయ పాటిల్, మాజీ మంత్రి కుమారుడు
14. సురేశ్ బాబు, శ్రీరాములు(మామ, అల్లుళ్లు)
15. అరవింద్ బెల్లాడ్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు
16. చంద్రకాంత్ పాటిల్, ఎమ్మెల్సీ కుమారుడు
17. సప్తగిరిగౌడ,మాజీ మంత్రి కొడుకు
18. అమృత్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు
19. సిద్ధార్థ్ సింగ్, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు
20. పూర్ణిమ శ్రీనివాస్, మాజీ మంత్రి కుమార్తె