నేపాల్ మెరుపు వరదకు కారణమేంది?
న్యూఢిల్లీ, ఆగస్టు 26: చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగి విరుచుకుపడటంతో బుధవారం నేపాల్లో భారీ వరదలు సంభవించి దాదాపు 100 మంది మరణించగా విదేశీయులతోసహా వందలాది మంది గల్లంతయ్యారు. విధ్వంసం సృష్టించిన ఈ ఆకస్మిక వరదలకు గల కారణంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది. ప్రాథమిక అంచనా ప్రకారం లెండే నదిని హిమపాతం అడ్డుకోవడం వల్ల నీరు నిలిచిపోయి దిగువన అకస్మాత్తుగా ఉప్పొంగి ప్రవహించి ఉండవచ్చని తెలుస్తున్నది.
నేపాల్, చైనాలోని శాస్త్రవేత్తలతో జరిపిన చర్చల ఆధారంగా ఈ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఖాట్మండు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, వాతావరణ పరిశోధకుడు రిజన్ భక్త కాయస్థ పేర్కొన్నట్టు ది ఖాట్మండు పోస్ట్ తెలిపింది. నేపాల్ వైపు నుంచి వచ్చిన హిమపాతం లెండే నదిలో పది దాని ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు కినిస్తున్నదని ఆయన అన్నారు. దాదాపు అదే సమయంలో టిబెట్ వైపు కూడా భూకంపం సంభవించినట్టు తెలుస్తున్నది. గోసైన్కుండకు ఉత్తరాన సుమారు 47 కిలోమీటర్ల దూరంలోని టిబెట్ ప్రాంతంలో ఉదయం 8.37 గంటలకు 4.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే నమోదు చేసింది.
అయితే వరదలు రావడంలో భూకంపం ఏమైనా పాత్ర పోషించిందా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ విపత్తుకు హిమనీనద సరస్సు విస్ఫోటనం దోహదపడిందా అనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో అనేక పెద్ద హిమనీనద సరస్సులు ఉన్నందున హిమనీనద సరస్సు విస్ఫోటనం చెందిందో లేదో నిర్ధారించడానికి కొన్ని రోజులు పట్టవచ్చని కాయస్థ తెలిపారు. 2025 జూలై 8న ఆ ప్రాంతంలో ఇలాంటిదే మరో విపత్తు సంభవించింది. హిమనీనద సరస్సు ఒక్కసారిగా తెగిపోవడం వల్ల లెండే నదిలో అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. నేపాల్-చైనా సరిహద్దు సమీపంలో ఒక మిమనీనద సరస్సు తెగిపోయిందని ఆ సమయంలోని ఉపగ్రహ చిత్రాలు సూచించాయి.
నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్
నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆకస్మిక వరవల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నేపాల్కు సాధ్యమైనంత మానవతా సహాయం అందచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని, సహాయక, పునరావాస చర్యల విషయంలో తమ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మోదీ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నేపాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బీహార్లో వరద ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడంలో పూర్తి సహాయం అందచేస్తామని బీహార్ ప్రభుత్వానికి ఆయన హామీ ఇచ్చారు.