న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన నీట్-యూజీ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన 5,440 కేంద్రాల్లో 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. బయో మెట్రిక్ వెరిఫికేషన్, క్షుణ్ణంగా తనిఖీ చేయడం, ఏఐ ఆధారిత నిఘా, సీసీటీవీ కవరేజ్, సిగ్నల్ జామర్లు తదితర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహించింది. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీల సమయంలో విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు తనిఖీల సమయంలో విద్యార్థులను మతపరమైన వస్ర్తాలు, ఇతర వస్తువులను తొలగించాలని కోరడంతో పలు చోట్ల స్వల్ప వివాదాలు తలెత్తాయి. కోల్కతా పరిధిలో గల ఢాకురియాకు చెందిన సృష్టి దూబె పరీక్షకు వారం రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో గాయపడి, సర్జరీ చేయించుకుంది. ఆమె అధికారుల సహాయంతో ప్రత్యేక వైద్య ఏర్పాట్ల మధ్య పరీక్ష రాసి, తన పట్టుదలను చాటుకుంది.
పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో తాము పలు రవాణా ఇబ్బందులను ఎదుర్కొన్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఇద్దరు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో, వారిని లోనికి అనుమతించలేదు. మరోవైపు కోల్కతాలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయంగా మారి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కాగా ముంబైలో ‘బెస్ట్’ ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ, మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
ఢిల్లలో పరీక్షకు హాజరైన కిషన్ అనే అభ్యర్థి ‘పీటీఐ’తో మాట్లాడుతూ ‘గత పరీక్షతో పోలిస్తే ఈసారి భద్రతను భారీగా పెంచారు. గత నెల రోజుల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేను శక్తిమేరకు రివిజన్ చేసుకున్నాను. ఈ సారైనా పరీక్ష పారదర్శకంగా జరుగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా క్వాలిఫై అవుతామనుకున్న అభ్యర్థులు మానసిక వేదనతో నలిగిపోయారు’ అని పేర్కొన్నాడు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ పరీక్షను ఇంగిష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు.
పరీక్ష ముగిసిన వెంటనే ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ జవాబు పత్రాలను సీజ్ చేసి, భద్రతా కేంద్రాలకు తరలించారు. కొద్ది రోజుల్లో ఎన్టీఏ ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ కీని విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తుంది.
అభ్యర్థుల నుంచి అందిన ప్రాథమిక స్పందనల ప్రకారం ప్రశ్న పత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భౌతికశాస్త్రం సెక్షన్ అత్యంత సవాలుగా నిలిచింది. నిపుణులు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ సబ్జెక్టుల ప్రశ్నల సరళి, క్లిష్టత స్థాయి, గత పరీక్షలతో పోలికలపై సమగ్రం సమాచారం త్వరలోనే అందుబాటులోకి రానున్నది.