Neelam | న్యూఢిల్లీ : పోలీసుల వలయాన్ని దాటుకొని పార్లమెంట్ ప్రాంగణంలో ఎల్లో స్మోక్ వదిలిన నీలం అనే యువతిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నీలం హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన యువతి అని పోలీసులు తేల్చారు. అయితే నీలం ఫోటోలు టీవీల్లో రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
ఈ ఘటనపై నీలం సోదరుడు రామ్నివాస్ స్పందించారు. తన సోదరి టీవీల్లో వస్తున్నారని తమ బంధువు ఒకరు చెప్పారని తెలిపాడు. దాంతో తాము టీవీ చూడగా, పార్లమెంట్ వద్ద ఎల్లో స్మోక్ వదిలినట్లు వార్తల్లో చూశామన్నాడు. ఉన్నత విద్య కోసం ఆమె హిసార్ వెళ్లిందని చెప్పాడు. ఆమెకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశాడు. అసలు ఆమె ఎందుకు అలా చేసిందో అర్థం కావడం లేదు. రెండు రోజుల క్రితమే ఆమె ఇంటి నుంచి హిసార్కు వెళ్లిందని రామ్ నివాస్ తెలిపాడు.
నీలం తల్లి సరస్వతి కూడా స్పందించారు. ఈ ఘటనకు గురించి పూర్తి వివరాలు తనకు తెలియదని ఆమె తెలిపింది. ఇవాళ ఉదయమే నీలంతో ఫోన్లో మాట్లాడానని పేర్కొంది. టీవీల్లో చూసి షాక్ అయ్యామని సరస్వతి తెలిపింది.