న్యూఢిల్లీ: దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొనసాగాలా?. అంటే అవుననే అంటున్నది ఇండియా టుడే-సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నివేదిక. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 324 సీట్లు లభిస్తాయని సర్వేలో తేలింది. విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 208 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని స్పష్టమైంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 14 దాకా ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ లోక్సభ నియోజకవర్గాల్లో 54,788 మందిని ప్రశ్నించారు. సీవోటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా ద్వారా మరో 1,52,038 మంది అభిప్రాయాలు సేకరించారు. మొత్తంగా 2,06,826 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నివేదికను రూపొందించారు. దీనిద్వారా లోక్సభకు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యమని వెల్లడైంది. పార్టీల పరంగా చూస్తే బీజేపీకి సొంతంగా 260 సీట్లు, కాంగ్రెస్కు 97 సీట్లు రానున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 44 శాతం ఓట్లు లభించగా, ఇప్పుడు 46.7 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 40.9 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే పేర్కొంది.
ఇండియా టుడే-సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే..
అయితే గత ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో బీజేపీకి 281 సీట్లు వస్తాయని తేలింది. తాజాగా ఆ సంఖ్య 21 స్థానాలు కోల్పోయి 260కి పడిపోయింది. అదేవిధంగా ఎన్డీయే కూటమికి 343 రాగా, అది 324కు తగ్గింది. ఇక కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో గెలుస్తుందని ఫిబ్రవరిలో తేలగా, ఇప్పుడు ఆ సంఖ్య 97కు పెరిగింది. ఇది 2024 ఎన్నికల్లో కంటే 2 స్థానాలు తక్కువ కావడం గమనార్హం.
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాలకుగాను బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మెజార్టీ మార్కుకు మరో32 సీట్లు దూరంలో నిలిచిపోయింది. దీంతో మిత్రపక్షాల సహాయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఎన్డీయేకు ప్రస్తుతం 293 సీట్లున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండీ కూటమి 234 సీట్లు సాధించింది. విపక్షాలన్నీ ఒక్కటై పోటీచేసినప్పటికీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యాయి.