ముంబై : యూపీలో యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల విధానంపై హడావిడి చేస్తోందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఇద్దరికి మించి పిల్లలను కలిగిఉండరాదనే విధానం కొత్తది కాదని, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అమలవుతోందని చెప్పారు. మహారాష్ట్రలో ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే వారు స్ధానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన ఉన్నదని పేర్కొన్నారు.
ఇక యూపీలో తీసుకువచ్చిన ముసాయిదా పాలసీ ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్ధానిక సంస్ధల్లో పోటీ చేసేందుకు అనర్హులు కావడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతి కోల్పోతారు. ప్రభుత్వ సబ్సిడీ పొందేందుకు వీరు అనర్హులుగా పరిగణించబడతారు. ఇక యూపీ సీఎం అసలు సంతానం వద్దని లేదా అధిక సంతానాన్ని ప్రోత్సహించే విధానాన్ని తీసుకురావాలని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సూచించారు.
ఓవైపు బీజేపీ, ఆరెస్సెస్ నేతలు చాలా మంది అవివాహితులై సంతానం లేదని, మరోవైపు సాక్షి మహరాజ్ వంటి కాషాయ పార్టీ నేతలు హిందువులను ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరుతుంటారని చెప్పుకొచ్చారు. అందుకే పార్టీ నేతల కోరిక మేరకు ఆ తరహా విధానాన్ని యోగి ఆదిత్యానాధ్ తీసుకురావాలని మాలిక్ సూచించారు. ఇక తన కదలికలపై మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ కన్నేసిందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.