ముంబై : నరేంద్ర మోదీ సర్కార్పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా లేనందునే ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తారని వ్యాఖ్యానించారు.
ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం లా కమిషన్కు నివేదించిందని, కమిషన్ వివిధ వర్గాలు, సంస్ధల నుంచి ప్రతిపాదనలను కోరిందని పవార్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ లా కమిషన్కు 900 ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో ఏముందనేది తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ప్రతిపాదనలను కమిషన్ బహిర్గతం చేయలేదన్నారు. ఇక యూసీసీపై సిక్కులు, జైన్లు, క్రిస్టియన్ వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాల్సి ఉందన్నారు. సిక్కులు దీనిపై భిన్న వైఖరితో ఉన్నారని తనకు తెలిసిందని పవార్ చెప్పారు. ఈ వర్గం వైఖరిని మనం విస్మరించరాదని పవార్ పేర్కొన్నారు.
Read More :