ముంబై : పార్లమెంట్లో సంఖ్యాబలం చూసుకుని బీజేపీ విర్రవీగుతోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ ఇదే అహంకారంతో ముందుకెళితే బీజేపీ రోజులు దగ్గరపడతాయని హెచ్చరించారు. సామాన్యులు ఏకమైతే కాషాయ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని అన్నారు.
ధూలేలో శనివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవార్ మాట్లాడారు. బీజేపీ పాలనను బ్రిటిష్ హయాంతో పోల్చిన శరద్ పవార్ బీజేపీ దురహంకారంతో వ్యవహరిస్తే ఆ పార్టీకి సామాన్యులు గుణపాఠం చెబుతారన్నారు. సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీలు ప్రవర్తించిన తీరు పట్ల ఎన్సీపీ చీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమ పార్టీ సహచరుడు రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యల వివాదంలో తనను ఎందుకు లాగుతున్నారని ఓ బీజేపీ ఎంపీని సోనియా గాంధీ ప్రశ్నిస్తే కాషాయ పార్టీ ఎంపీలు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆక్షేపించారు. సోనియా గాంధీకి రక్షణ వలయంలో తమ పార్టీ ఎంపీ సుప్రీయా సూలె ఆమెను వాహనం ఎక్కించేవరకూ ఉన్నారని చెప్పుకొచ్చారు. తమను ప్రశ్నించే వారి పట్ల బీజేపీ నేతల తీరు అహంభావ ధోరణితో ఉంటుందని ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు.