పంజాబ్ ఫలితాలు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పంజాబ్ ప్రజలకు ఏమాత్రం నచ్చలేదని, అందుకే ఓడిపోయారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీతో జట్టు కట్టడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అన్నారు. ‘కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టుకున్నారు. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో జట్టు కట్టారు. పంజాబ్ ప్రజలకు ఇది రుచించలేదు’ అని పవార్ పేర్కొన్నారు.
పంజాబ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడిపోయారు. పాటియాలా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అమరీందర్ సింగ్… ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసావహిస్తానని ప్రకటించారు. ‘ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా. అత్యంత నిరాడంబరంగా స్వీకరిస్తున్నారు. కులం, మతం అన్న గోడలను దాటి.. పంజాబ్ ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. పంజాబియత్ స్ఫూర్తిని చాటారు’ అంటూ కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్లో పేర్కొన్నారు.