Supreme Court : ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే టైటిల్తో 8వ తరగతి సోషల్ సైన్స్లో ఇటీవల ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు.
దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ వ్యవహారం అందరినీ కలవరానికి గురిచేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కొన్ని రోజులు ఆగాలని, దీనిపై తాను సుమోటోగా విచారణ చేపడతానని చెప్పారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
ఎన్సీఈఆర్టీ.. 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం నుంచి స్పందన వచ్చింది.