IED blast : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగ్లూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మరణించాడు. ఈ సందర్భంగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రతాసిబ్బందికి గాయాలయ్యాయి.
ముంగా గ్రామంలో మావోయిస్టు డివిజన్ కమిటీ మెంబర్ దినేష్ మొదియమ్, కమాండర్ వెల్లాతోపాటు 30 నుంచి 40 మంది భేటీ అయ్యారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాల్పులు శబ్ధం ఆగిన అనంతరం భద్రతా సిబ్బంది పరిశీలించగా ఒక మావోయిస్టు మృతదేహం లభించింది.
ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు సంబంధించిన 9 ఎంఎం పిస్టల్, ఒక మందుపాతర, ఆరు రిమోట్ స్విచ్లు, మావోయిస్టులకు సంబంధించిన ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా ప్రాంతంలో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.