న్యూఢిల్లీ : ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుపై తాను నోరు మెదిపినప్పటి నుంచి తనపై తప్పుడు కేసు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను అనుసరిస్తున్నారని, తన కుటుంబ సభ్యుల కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు.
తాను దుబాయ్ పర్యటనకు వెళ్లగా అక్కడ కారులో కూర్చుని ఫోటోలు తీస్తున్న ఇద్దరు పట్టుబడ్డారని..దీనిపై తాము ముంబై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నరో నిగ్గుతేల్చాలని కోరతామని అన్నారు. దీనిపై తన వద్ద ఉన్న ఆధారాలను కూడా త్వరలో బయటపెడతానని వెల్లడించారు.
అనిల్ దేశ్ముఖ్ మాదిరిగా తనను కూడా తప్పుడు కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఓ నేతను తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నించడం సరైంది కాదని నవాబ్ మాలిక్ మండిపడ్డారు.ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసేందుకు ప్రైవేట్ ఏజెంట్లను వాడుకుంటున్న కేంద్ర దర్యాప్తు సంస్ధల అధికారులపై దృష్టిసారించాలని కోరుతూ తాను హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఆయన చెప్పుకొచ్చారు.