ముంబై : మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ఓటు వేసేందుకు జైలు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ శుక్రవారం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని కోరుతూ మహారాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్లు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సోమవారం మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరో వైపు సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నందున సమయం తక్కువగా ఉందని మాజీ హోంశాఖ మంత్రి న్యాయవాది తెలిపారు. పిటిషన్ విచారణపై వెకేషన్ బెంచ్ నిర్ణయం తీసుకోనున్నది.