న్యూఢిల్లీ, మార్చి 30: భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ‘ఎఫ్వీ ఏఐ కంబర్ 786’ అనే ఇరాన్ ఫిష్షింగ్ నౌక, అందులోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని శుక్రవారం సురక్షితంగా కాపాడింది. ఈ ఆపరేషన్ కోసం ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్లను మోహరించింది. తమను కాపాడినందుకు నౌకలోని పాకిస్థాన్ దేశస్తులు భారత నేవీకి ధన్యవాదాలు చెబుతూ ‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను నావికా దళం షేర్ చేసింది. నౌక హైజాక్ ఘటనకు సంబంధించి భారత నేవీ తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకొన్నది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనేందుకు దేశానికి తీసుకురానున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.