పంజాబ్లో కాంగ్రెస్ అట్టర్ ప్లాఫ్షోపై పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. పంజాబ్ ప్రజలు మార్పును కోరే ఆప్కు ఓటు వేశారని ప్రకటించారు. కొత్త మార్పుకు నాంది పలికిన పంజాబ్ ప్రజల నిర్ణయానికి శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఓ బాధ్యతాయుతమైన పార్టీ పదవిలో ఉంటూ.. ఇలా ఎలా అంటారని ఎదురు ప్రశ్నించగా… మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. వారిది ఎప్పుడూ తప్పుడు నిర్ణయం కాదు. ప్రజల మాట దేవుడి మాటే. ప్రజల తీర్పును అర్థం చేసుకొని, శిరసావహించడమే అంటూ సిద్దూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ అభివృద్ధే తన ధ్యేయమని, దీని నుంచి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సిద్దూ స్పష్టం చేశారు. అన్ని బంధాలనూ తెంచుకోవడం, మృత్యువుకు భయపడకపోవడం అనే లక్షణాలు ఓ యోగి లక్షణాలని వివరించారు. నేను పంజాబ్ కోసమే ఉన్నాను. పంజాబ్లోనే ఉంటాను. లాభమైనా, నష్టమైనా… దేనినీ దగ్గరికి రానివ్వను. నా కోసం గోతులు తవ్విన వారు పది ఫీట్ల బొందలో పడిపోయారు. ఓ మార్పు కోసమే ఆప్కు ఓటు వేశారు. ఆప్ అభ్యర్థులను అభినందిస్తున్నా. అంటూ సిద్దూ పేర్కొన్నారు.