చండీగఢ్: పంజాబ్ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. అయితే, మొన్నటిదాకా పట్టుబట్టి కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేలా చేసిన సిద్ధూ.. ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సిద్ధూ ఆకస్మికంగా రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఇటీవల పంజాబ్ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ అమరీందర్సింగ్ను పదవి నుంచి దించడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ సిద్ధూ పావులు కదిపారు. చివరకు అధిష్ఠానాన్ని ఒప్పించి అమరీందర్ను గద్దె దించేందుకు ప్లాన్ చేశారు. అయితే ముందే ఈ విషయాన్ని పసిగట్టిన అమరీందర్ సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత చరణ్జీత్సింగ్ను నూతన ముఖ్యమంత్రిగా నియమించడం, కొత్తమంత్రివర్గం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సిద్ధూ పీసీసీ చీఫ్ పదవిలోకి వచ్చిన 72 గంటలకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.