భువనేశ్వర్: ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ (Parliament) ప్రారంభోత్సవాన్ని (Inauguration) బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ (PM Modi) పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని పేర్కొన్నాయి. అయితే విపక్షాల వాదన ఎలా ఉన్నా తాము మాత్రం సెంట్రల్ విస్టా ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొంటున్నామని ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
రాష్ట్రపతి భారత దేశానికి అధిపతి. పార్లమెంటు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంది. రెండు సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకలు. ఇవి రాజ్యాంగం నుంచి తమ అధికారాన్ని పొందుతున్నాయి. ఈ రాజ్యాంగ సంస్థలు తమ పవిత్రతను, గౌరవాన్ని ప్రభావితం చేసే ఏదైనా సమస్యకు అతీతంగా ఉండాలి బీజేడీ విశ్విస్తుంది. అలాంటి సమస్యలపై సభలో చర్చజరుగుతుంది. అందువల్ల ఈ ముఖ్యమైన సందర్భంలో బీజేడీ భాగం అవుతుందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరవుతామని వైసీపీ, శిరోమణి అకాళీదల్, టీడీపీ, శివసేన (షిండే వర్గం), బీఎస్పీ, అన్నాడీఎంకే ప్రకటించాయి.
కాగా, కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ఒక మహత్తరమైన సందర్భమని, అయితే ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం నేరుగా చేస్తున్న ప్రత్యక్ష దాడికి నిరసనగా తాము ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే సహా 19 విపక్షాలు స్పష్టం చేశాయి. ‘ప్రజాస్వామ్యానికి బీజేపీ ప్రభుత్వం ముప్పుగా పరిణమించినా, కొత్త పార్లమెంట్ నిర్మాణం విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిరంకుశంగా ముందుకు వెళ్లినా, విభేదాలను పక్కనపెట్టి ప్రారంభోత్సవానికి హాజరుకావాలని అనుకొన్నాం. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కకు పెట్టి, ప్రధాని మోదీ తానే పార్లమెంట్ను ప్రారంభిస్తుండటం.. రాష్ట్రపతిని అవమానించడమే కాకుండా, నేరుగా మన దేశ ప్రజాస్వామ్యంపై జరిపిన దాడిగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నాయి.
‘రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం కూడా. పార్లమెంట్ నిర్వహణలో కీలక బాధ్యతలు కలిగి ఉంటారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు పిలుస్తారు. సభలు ప్రొరోగ్ చేయడం, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. రాష్ట్రపతి లేకుండానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నిర్ణయించడం అత్యున్నత రాష్ట్రపతి పదవిని అవమానించడమే” అని విపక్షాలు పేర్కొన్నాయి. ఉపరాష్ట్రపతిని కూడా ఆహ్వానించకపోవడం ఏమిటని విపక్ష నేతలు తప్పుబడుతున్నారు.
కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ, ఆప్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన(యూబీటీ), ఆర్జేడీ, ఐయూఎంఎల్, జేఎంఎం, ఎన్సీ, కేసీ(ఎం), ఆర్ఎస్పీ, వీసీకే, ఎండీఎంకే, ఆరెల్డీ.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలా వద్దా అనే విషయంపై గురువారం నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు తెలిపారు. దేశ నిర్మాణంలో, భారత రాజ్యాంగాన్ని రచించడంలో చేసిన కృషిని గౌరవిస్తూ నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ ఇది వరకే డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి హాజరుపై నిర్ణయం తీసుకుంటారని బీఆర్ఎస్ ఎంపీ ఒకరు తెలిపారు.