న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా (Most Popular CM) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. అయోధ్యలో బాల రాముని ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanat) రెండో స్థానానికే పరిమితమయ్యారు. దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన, ఆమోదయోగ్యమైన ముఖ్యమంత్రుల జాబితాను ఓ ఆంగ్ల పత్రిక రూపొందించింది. ఇందులో ఒడిశాను 20 ఏండ్లకుపైగా పరిపాలిస్తున్న 77 ఏండ్ల నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) 52.7 శాతంతో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన 2000, మార్చి నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నిరాటంకంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.
ఇక.. పాపులారిటీలో 51.3 శాతంతో పట్నాయక్ కంటే 1 శాతం తక్కువ జనాధరణతో యూపీ సీఎం యోగీ నిలిచారు. 2017, మార్చిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్.. ఉత్తరప్రదేశ్లో అత్యధిక కాలం సీఎంగా కొనసాగుతున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. 48.6 శాతం ప్రజాదరణతో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన 2021లో బాధ్యతలు చేపట్టారు.
42.6 శాతంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాలుగో స్థానంలో నిలవగా.. తిప్రుర సీఎం మాణిక్ సాహాకు 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానం దక్కింది. గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా 2021, సెప్టెంబర్లో భూపేంద్ర ప్రమాణ స్వీకారం చేయగా, 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సాహా.. 2022లో త్రిపుర సీఎం పదవిని దక్కించుకున్నారు.