న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె కారణంగా గురువారం వివిధ రాష్ర్టాల్లో సామాన్య జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. రవాణా, బ్యాంకింగ్తోపాటు ప్రభుత్వ సేవలకు అవరోధం ఏర్పడింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని నిరసనకారులు డిమాండు చేశారు. ఈ చట్టాలు కార్మికుల హక్కులను బలహీనపరిచాయని, ఉద్యోగ భద్రతను తగ్గించాయని, ఉద్యోగ నియామకాలు, ఉద్వాసనలను యాజమాన్యాలకు సులభతరం చేశాయని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఎంజీనరేగాను పునరుద్ధరించాలని, వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్(గ్రామీణ్)ని రద్దు చేయాలని కూడా నిరసనకారులు డిమాండు చేశారు. ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్త్తు సవరణ బిల్లు, అణు ఇంధనానికి సంబంధించిన శాంతి చట్టాన్ని రద్దు చేయాలని కూడా కార్మిక సంఘాలు డిమాండు చేశాయి. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఒడిశా, బీహార్లో సమ్మె విజయవంతమైనట్లు తమకు సమాచారం అందిందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ గురువారం తెలిపారు. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, రవాణా, ఆరోగ్య, బొగ్గు, బొగ్గేతర గనులు, గ్యాస్ పైప్లైన్, విద్యుత్తు రంగాల్లో సమ్మె ప్రభావం ఉందని ఆమె చెప్పారు. సమ్మె కారణంగా భువనేశ్వర్, కటక్, రూర్కెలా వంటి నగరాల్లో రవాణా సర్వీసులు నిలిచిపోయాయి.