16 రాష్ర్టాల్లో మిన్నంటిన నిరసన ప్రదర్శనలు
బీహార్లో తారెగ్నా రైల్వేస్టేషన్కు నిప్పు
పలు రాష్ర్టాల్లో బస్సులు, వాహనాల ధ్వంసం
పోలీసుల లాఠీచార్జీ.. వందలమంది అరెస్టు
న్యూఢిల్లీ, జూన్ 18: సైన్యంలో తాత్కాలిక నియామకానికి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ పథకం రేపిన మంటలు ఇంకా చల్లారడంలేదు. తమ భవిష్యత్తును కాలరాసేలా ఉన్న ఈ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజు కూడా ఆర్మీ ఉద్యోగార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. 16 రాష్ర్టాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో శనివారం ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు ఓ రైల్వే స్టేషన్తో పాటు పలు వాహనాలు, బస్సులకు నిప్పుపెట్టారు. రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. ఆందోళనల నేపథ్యంలో 369 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.
బీహార్: ‘అగ్నిపథ్’ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలంటూ శనివారం నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. దుకాణాలను మూసివేయిస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు రాళ్లు రువ్వారు. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనకారు లు పాట్నాలో తారెగ్నా రైల్వేస్టేషన్కు నిప్పు పెట్టారు.
హర్యానా, పంజాబ్: రెండు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మహేందర్ఘర్ రైల్వేస్టేషన్ బయట పార్క్ చేసిన పలు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. లూధియానా రైల్వేస్టేషన్లోకి దూసుకుపోయిన 50 మందికిపైగా ఆందోళనకారులు సామగ్రిని ధ్వంసం చేశారు. సోనిపట్లో హైవేను దిగ్బంధించారు.
బెంగాల్: కోల్కతాలోని హజ్రా ప్రాంతంలోని రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించిన ఏఐడీఎస్వో, ఏఐడీవైవో ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. పలువురిని అరెస్ట్ చేశారు. సీఎం మమత ఇంటికి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది.
యూపీ: కన్నౌజ్, మీరట్, జౌన్పూర్, లక్నో తదితర ప్రాంతాల్లో నిరసనలు ఉద్ధృతంగా జరిగాయి. జౌన్పూర్లో ఆందోళనకారులు ఒక పోలీసు జీపుకు, ఉత్తరప్రదేశ్ రోడ్వేస్కు చెందిన ఓ బస్సుకు నిప్పు పెట్టారు. మీరట్లో ఆప్, ఆరెల్డీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. బల్లియాలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్ణాటక: ధార్వాడలో నిరసన ప్రదర్శన చేపడుతున్న ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
జమ్ముకశ్మీర్: కతువాలోని జమ్ము-పఠాన్కోట్ హైవేను దిగ్బంధించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.
ఒడిశా: అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా నబరంగ్పూర్లో 60 కిలోమీటర్ల మేర పరుగెత్తి ఆర్మీ అభ్యర్థులు తమ నిరసనను తెలియజేశారు.
గుజరాత్: జామ్నగర్ సిటీలోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ముందు వందలాది మంది నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.
రాజస్థాన్: జైపూర్, జోధ్పూర్, ఝుంఝునులోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. అల్వార్లోని జైపూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేని ఆందోళనకారులు దిగ్బంధించారు.
కేరళ: తిరువనంతపురంలోని థంపనూర్ ఏరియాలో వందలాది మంది నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏపీ: అగ్నిపథ్ సెగ ఏపీని కూడా తాకింది. విశాఖ రైల్వే స్టేషన్ను అధికారులు సుమారు 12 గంటల పాటు మూసేశారు. విజయవాడ నుంచి అటువైపు వెళ్లే రైళ్లన్నీ దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే వాటిని కొత్తవలస వద్ద నిలిపేశారు. గుంటూరులో ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
ఈ రాష్ర్టాల్లోనూ: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ రాష్ర్టాల్లోనూ నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్ను నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగార్థులకు సంఘీభావంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం సత్యాగ్రహ దీక్ష చేపట్టన్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఈ దీక్షలో పాల్గొననున్నారు.
వాళ్లు సైన్యంలో చేరడానికి అనర్హులు
ప్రభుత్వ ఆస్తులను దహనం చేసేవాళ్లు సైన్యంలో చేరడానికి అనర్హులని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ అన్నారు. క్రమ శిక్షణ లేనివాళ్లకు సైన్యంలో ఇసుమంతైనా చోటు లేదని పేర్కొన్నారు. అనిల్ పురీ మిలిటరీ వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఆర్మీలో యువతను పెంచాలన్న లక్ష్యంతోనే తాజా నిర్ణయం తీసుకొన్నట్టు అనిల్ పురీ పేర్కొన్నారు.
‘అగ్నిపథ్’ రద్దుకు రాజస్థాన్ తీర్మానం
‘అగ్నిపథ్’ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ మంత్రి మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో జరిగిన భేటీలో ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ఏదైనా స్కీమ్ను ప్రవేశపెట్టాలనుకొంటే ముందుగా అన్నివర్గాలతో చర్చలు జరుపాలని కేంద్రానికి గెహ్లాట్ హితవు పలికారు.
బీజేపీ, జేడీయూ మాటల యుద్ధం
‘అగ్నిపథ్’ బీహార్లో బీజేపీ, జేడీయూ మధ్య అగ్గి రాజేసింది. యువత శుక్రవారం బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ ఇంటిని ధ్వంసం చేశారు. ఆందోళనలను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోలేదని సంజయ్ అన్నారు. సంజయ్ వ్యాఖ్యలపై జేడీయూ నేత లలన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడా నిరసనలు జరిగాయి కదా ప్రశ్నించారు.
అభిప్రాయాలు, సలహాలు, సంప్రదింపులు, ఆమోదాలు, చర్చలు, ఉమ్మడి సమావేశాలు, నిర్ణయాలు.. ఇలాంటి ప్రజాస్వామిక విధానాలు బీజేపీ డిక్షనరీలో లేనేలేవు. దీని వలన పదేపదే దేశంపై ఏకపక్ష నిర్ణయాలను రద్దుతున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, పథకాల వల్ల దేశ శక్తి, మానవ వనరులకు నష్టం చేకూరుతున్నది.
-ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
సాయుధ దళాలు, దేశ భద్రత, యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో ‘ముందు బాదేయడం, తరువాత ఆలోచించడం’ అనే విధానం ఒక బాధ్యయుతమైన ప్రభుత్వానికి మంచిది కాదు. అగ్నిపథ్ స్కీమ్లో ప్రకటించిన మార్పులను పరిశీలిస్తే.. పాలసీ రూపకల్పన సమయంలో వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకోలేదనే విషయం అర్థమవుతున్నది.
–బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ
గతంలో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టుగానే, ప్రధాని మోదీ ‘మాఫీవీర్’గా మారి డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్ను వెనక్కు తీసుకోవాలన్న యువత డిమాండ్ను అంగీకరించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా ‘జై జవాన్, జై కిసాన్’ విలువలను అవమానిస్తూనే ఉన్నది.
–కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ