న్యూఢిల్లీ: సుమారు 25 వేల కిలోమీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారుల్ని నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పీఎం గతీ శక్తి మాస్టర్ ప్లాన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎక్స్ప్రెస్వేలను ఈ ఏడాది పెంచనున్నట్లు ఆమె చెప్పారు. వేగంగా ప్రయాణికులు, సరుకులను తరలించేందుకు కొత్తగా రహదారుల్ని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2022-23 సంవత్సరంలో అదనంగా 25వేల కిలోమీటర్ల నేషనల్ హైవేను నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రజా వనరులను కల్పించేందుకు 20 వేల కోట్లను సమకూర్చనున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. పీఎం గతీశక్తి ప్లాన్లో ఏడు ఇంజిన్లు ఉన్నాయని, వాటితోనే దేశ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు ఆమె చెప్పారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్ట్లు, రవాణా, వాటర్వేస్, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు.