న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ నెల 8న ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఈడీ కోరిందని పేర్కొన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, సోనియా జూన్ 8న ఈడీ కార్యాలయానికి వెళ్తారని ఈ పార్టీ అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.
రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆ లోపు తిరిగి వస్తే ఈడీ ఎదుట హాజరవుతారని, రాలేకపోతే కొంత సమయం కోరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈడీ నోటీసులపై రణదీప్ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. ప్రతిసారీ నేషనల్ హెరాల్డ్ను లక్ష్యంగా చేసుకుంటూ.. బీజేపీ స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందని, అగౌరవపరిచిందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్ వారు దాన్ని అణవిచివేసేందుకు ప్రయత్నించారని, నేడు మోదీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.