న్యూఢిల్లీ, నవంబర్ 22: నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంపై బీజేపీ స్పందించింది. తమ పాపాలకు గాంధీ కుటుంబం తగిన ఫలితం అనుభవించాల్సిందేనని పేర్కొన్నది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ ఆస్తులను గాంధీ కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకొన్నదని ఆరోపించారు.
ఆ వార్తాపత్రికకు చాలా నగరాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయని, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలు వాటిని అక్రమ మార్గంలో చేజిక్కించుకొన్నారని అన్నారు. సంస్థకు చెందిన షేర్లను సోనియా, రాహుల్ల నియంత్రణలోని కంపెనీకి బదలాయించారని ఆరోపించారు.