హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీపై అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విరుచుకుపడ్డారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రధాని నరేంద్రమోదీ అనుసరించిన వైఖరిని అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు.
నూతన పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కేవలం ఒక మతానికి చెందిన వారిని మాత్రమే లోపలికి రానిచ్చారని ఒవైసీ ఆరోపించారు. ప్రధాని తీరు సరైనది కాదని ఆయన విమర్శించారు. మోదీ కేవలం హిందువులకు మాత్రమే ప్రధాని కాదని, 130 కోట్ల మంది భారతీయులందరికీ ప్రధాని అని, కాబట్టి ఆయన అన్ని మతాల వారిని పార్లమెంటు లోపలికి తీసుకెళ్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.