న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోని అన్ని రాష్ర్టాలు, యూటీల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ దారా ఆయన పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, తద్వారా భారత్పై దాని ప్రభావం, ముఖ్యంగా ఎల్పీజీ, చమురు సరఫరా కొరతకు సంబంధించిన అంశాలపై సీఎంలతో చర్చిస్తారు.
ముఖ్యంగా వీటి సరఫరాలో కొరత కారణంగా రాబోయే రోజుల్లో ఎదురయ్యే గడ్డు పరిస్థితులపై, సన్నద్ధతా చర్యలపై ఈ సమావేశం దృష్టిపెడుతుంది. అంతేకాక సప్లయి చైన్స్, ఎనర్జీ భద్రత, విదేశాల్లో ఉంటున్న భారతీయల భద్రత తదితర అంశాలను కూడా ఇందులో చర్చిస్తారు. కాగా, కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాలు ఈ సమావేశంలో పాల్గొనవు. అయితే ఆయా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటేరియేట్ సమావేశమై తగు సూచనలు, ఆదేశాలను అందజేస్తుంది.