Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో కీలక మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిశారు. మరోవైపు బీజేపీలోనూ సంస్థాగత నిర్మాణంలో మార్పులు జరగనున్నాయి. కేంద్రం మంత్రివర్గంతోపాటు బీజేపీ కేంద్ర పదవుల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. తన కొత్త టీంను ఎన్నుకునే పనిలో ఉన్నారు. బీజేపీలో పదవుల నియామకం, మార్పులు వంటివి ఈ నెలాఖరులోపు పూర్తవుతాయి. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల గురించి కొందరు కేంద్ర మంత్రులతో కూడా నితిన్ నబిన్ ఇదివరకే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీజేపీ కార్యవర్గాన్ని కూడా ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యూబీ బీజేపీ కార్యవర్గంలో మార్పులు చేశారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గ పునర్య్వస్థీకరణకు సంబంధించి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొందరు మంత్రులకు ఇటీవల పార్టీ పరమైన బాధ్యతల్ని కూడా అధిష్టానం అప్పగించింది. ఇటీవలే కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు.
అలాగే, ఇటీవలే కొందరు కొత్తగా ఎంపీలుగా రాజ్యసభలోకి అడుగుపెట్టారు. వీరిలో కొందరికి కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. అయితే, ఈ అంశంపై మోదీ, అమిత్ షా సహా బీజేపీ నాయకత్వం పూర్తి గోప్యత పాటిస్తోంది. మోదీ తన చర్యల్ని చివరి నిమిషం వరకు వెల్లడించరు. అందువల్ల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధికారిక ప్రకటన వరకు ఎదురు చూడాల్సిందే.