ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తోందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా విపక్షాలను బెదిరించారని, ఇప్పుడు కూడా అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాషాయ నేతలపై మండిపడ్డారు.
దీనికి తమ వద్ద తగిన ఆధారాలున్నాయని, సరైన సమయంలో వీటిని ప్రజల ముందుంచుతామని అన్నారు. జూన్ 20న జరిగే మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో మహా వికాస్ అఘది (ఎంవీఏ) అభ్యర్ధులు ఆరుగురు విజయం సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నా తమ అభ్యర్ధుల గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం పది స్ధానాలకుగాను 11 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఎంవీఏ భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరేసి అభ్యర్ధులు బరిలో ఉండగా బీజేపీ అయిదుగురు అభ్యర్ధులను పోటీలో నిలిపింది.